ఎన్టీఆర్‌’ సినిమా audio launch NTR kathanayakudu #ntr mahanayakudu nandamuri bala krishna , vidhya balan,nithya menon,rakul preet ,rana,

నాన్న చేయని పాత్రల్ని కూడా నేను చేశానని నారదుడు, గౌతమీపుత్ర శాతకర్ణి పేర్లని చెప్పుకొనేవాణ్ని. అలాంటిది నాన్నగారి పాత్రనే చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రమే చూడాల్సిన సినిమా కాదు, ఆబాలగోపాలమూ చూడాల్సిన సినిమా’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన తండ్రి ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తూ, ఎన్‌.బి.కె ఫిలింస్‌ పతాకంపై  నిర్మిస్తున్న చిత్రాలు
‘ఎన్టీఆర్‌ కథా నాయకుడు’, ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’. విద్యా బాలన్‌ ముఖ్యభూమిక పోషించారు. క్రిష్‌ దర్శకుడు. సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్‌ ఇందూరి సహనిర్మాతలు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో గీతాలు, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్‌ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కలిసి ట్రైలర్‌ని ఆవిష్కరించారు. నందమూరి మోహనకృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ కలిసి పాటల్ని విడుదల చేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఇంత త్వరగా సినిమా పూర్తి కావడం, ట్రైలర్‌ విడుదల కావడం నమ్మశక్యంగా లేదు. ఎవరూ ఎప్పుడూ కూడా కష్టం అనుకోలేదు సెట్‌లో. ఎవరైనా నన్ను నువ్వు ఎవరివని అడిగితే భారతీయుడిని అంటాను. రెండోసారి అడిగితే తెలుగువాణ్నని అంటాను. ఇంకోసారి అడిగితే నందమూరి తారక రామారావు బిడ్డని అంటాను. మళ్లీ అడిగితే అన్నగారి అభిమానిని అంటాను. చరిత్ర సృష్టించడానికే మేము ఇక్కడున్నాం, అది పునరావృతం చేయడానికి కాదు. ప్రాచీన అంధ్ర చరిత్ర సృష్టికర్త గౌతమీపుత్ర శాతకర్ణి అయితే, ఆధునిక ఆంధ్ర చరిత్ర సృష్టికర్త నందమూరి తారక రామారావుగారు. అలాంటి మహానుభావుల పాత్రలు చేయడం గర్వంగా ఉంది. నాన్నగారు పార్టీ పెట్టాక కష్టపడిన శ్రామికుడు హరికృష్ణ అన్నయ్య. పార్టీ పెట్టిన కొత్తలో తండ్రికి తగ్గ తనయుడిగా చేదోడు వాదోడుగా మెలిగారు. మంత్రిగా కూడా ఎన్నో సేవల్ని అందించిన ఆయన అకాల మరణం  దుఃఖ సముద్రంలో ముంచేసింది. ఆయన పాత్రని వాళ్లబ్బాయి కల్యాణ్‌ చేశాడు. నేను మా నాన్న పాత్రని చేయడం, వాళ్ల నాన్న పాత్రని కల్యాణ్‌ చేయడం యాదృచ్ఛికం. నా చిన్నప్పటి పాత్రని మా రెండో అమ్మాయి కుమారుడు చేశాడు. ఏడు నెలల వయసులోనే నటనేంటో చూపించాడు. ప్రతి ఒక్కరూ వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయారు. అక్కినేని నాగేశ్వరరావు పొట్టి కదా, నేను మీకంటే ఎత్తు కదా అన్నాడు సుమంత్‌. ప్రేక్షకులు పాత్రల్నే చూస్తారు తప్ప, ఎత్తుని కాదని చెప్పా. ఎన్ని పార్టీలు, ఎంతమంది రాజకీయ నాయకులు ముందుకొచ్చి గొంతు చించుకున్నా అవన్నీ రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలకు కాపీనే. అలాంటి ముందుచూపు ఉన్న మహానుభావుడి పాత్ర చేయడం నా అదృష్టం’’ అన్నారు. క్రిష్‌ మాట్లాడుతూ  ‘‘ఒక కథ రాయడానికి, కథకున్న ఆత్మ పట్టుకోవాలి. ఈ సినిమాకి నాకు దొరికిన ఆత్మ బసవ రామ తారకం గారు. ఎన్టీఆర్‌ అంటే నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్‌ అక్షరాలను అటునుంచి చూస్తే రామ తారకం నందమూరిగారు. ఇలా అనుకొని వీళ్లిద్దరూ పుట్టారేమో. నేను, నా టీమ్‌ తరఫున జనవరి 9న రెండున్నర గంటలు మాట్లాడతా. ఫిబ్రవరి 7న మళ్లీ రెండున్నర గంటలు మాట్లాడతా. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటాం. మేం ఒక గొప్ప  చిత్రం చేశాం’’ అన్నారు. కథానాయకుడు ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘బాబాయ్‌ పక్కన నిలబడితే పెద్దాయన గుర్తుకొస్తున్నారు. ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక వ్యక్తినే అనేది ఎంతో గర్వకారణం. ఆయన ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ, ప్రతి ఇంటికీ చెందిన ఒక ధృవతార. తెలుగువాళ్లు అని కూడా మనల్ని సంబోధించని రోజుల్లో ఇదిరా తెలుగువాడి గౌరవం, ఇదిరా తెలుగువాడి పౌరుషం అని చెప్పుకొంటున్నామంటే దానివెనక ఎంతోమంది త్యాగాలు చేశారు. అందులో ఎన్టీఆర్‌ ఒక ప్రముఖుడు. ఆ మహానుభావుడి చరిత్ర మా తర్వాత తరానికి కూడా తీసుకెళుతున్నందుకు బాబాయ్‌ని ఎలా అభినందించాలో తెలియదు. చరిత్రకి విజయాలు, అపజయాలూ ఉండవు. చరిత్ర సృష్టించడం ఒక్కటే ఉంటుంది’’ అన్నారు. నందమూరి హరికృష్ణగా నటించిన నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘ఎన్‌.టి.ఆర్‌ జీవితం నుంచి నేర్చుకున్నదంటే ‘మనం ఇచ్చిన కమిట్‌మెంట్‌ని గౌరవించాలి, క్రమశిక్షణతో సినిమా చేయాల’న్నది. నేను బాబాయ్‌ నటించిన ‘బాలగోపాలుడు’ సినిమాతో నా నట జీవితాన్ని మొదలుపెట్టా. ముప్పయ్యేళ్ల తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

ఎమ్‌.ఎమ్‌.కీరవాణి మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌ గారి చివరి సినిమా మేజర్‌ చంద్రకాంత్‌కి సంగీతం చేసినందుకు గర్వపడుతుంటా. అంతకంటే గర్వపడేలా ఈ సినిమా అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. ఈ సినిమాకి పనిచేయడానికి నాకున్న అర్హత రామారావు వీరాభిమానిని కావడమే. ఆయన తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. అంతకంటే తక్కువ సమయంలో ఈ సినిమా తీశారు క్రిష్‌’’ అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘కాలచక్రాన్ని తిప్పి చూపించగలిగే అద్భుతం ఒక్క సినిమాకే ఉంది. ఆ సినిమా ద్వారానే  పరిశ్రమకి మూలపురుషుడైన మహాపురుషుడి జీవిత చరిత్ర   జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలయ్యతో నేను తీయబోయే మూడో సినిమా ఫిబ్రవరిలో మొదలుపెడతాం’’ అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘‘భారతదేశ ప్రజలందరికీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవుళ్లు ఉంటారు. తెలుగు జాతి మొత్తం ఆ ముగ్గురు దేవుళ్లని మూడక్షరాల్లో చూస్తారు. ఆ అక్షరాలే... ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ అంటే ఎవరో  తెలియనివాళ్లకి, 63 వేషాల్లో ఎన్టీఆర్‌ అంటే ఇదిరా అని ఈ సినిమాతో చూపించి, ఇంకా ఇతనికి మేం భారతరత్న ఎందుకు ఇవ్వలేదని కేంద్రప్రభుత్వం కంగారుపడే పరిస్థితి ఈ సినిమా చూశాక వస్తుందని విశ్వసిస్తున్నా’’ అన్నారు. ప్రముఖ నటుడు కృష్ణ మాట్లాడుతూ ‘‘చిన్నప్పట్నుంచి నేను రామారావుగారి అభిమానిని. డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత రామారావుగారిని చూడటానికే మద్రాసు వెళ్లాను. ‘నాకూ సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉంది, మీ సినిమాలో అవకాశమివ్వండని అడిగాను. ‘నువ్వు ఇంకా చిన్నపిల్లాడిలా ఉన్నావు, రెండు మూడేళ్ల తర్వాత నీకు భవిష్యత్తు ఉంటుంద’ని చెప్పారు. ఈలోగా ఆదుర్తి సుబ్బారావు ‘తేనె మనసులు’తో అవకాశమిచ్చారు. ‘స్త్రీ జన్మ’లో తొలిసారి ఎన్టీఆర్‌తో కలిసి నటించా. ఆ తర్వాత ‘నిలువు దోపిడీ’, ‘విచిత్రకుటుంబం’ కలిసి చేశాం. నా ‘పండంటి కాపురం’ వంద రోజులు వేదికపై ‘తదుపరి సినిమాని రామారావుగారితో తీయాలనుంద’ని చెప్పాను. ఆ మాట విని ‘తప్పకుండా బ్రదర్‌, మీ సినిమాలో నటిస్తా. సబ్జెక్ట్‌ చూసుకోండ’ని చెప్పారు. ‘దేవుడు చేసిన మనుషులు’ కథ చెప్పగానే చాలా బాగుందని చెప్పి ఒకే షెడ్యూల్‌లో నటించారు. ఆ చిత్రం అఖండ విజయం సాదించింది. రామారావుగారికి తమ్ముడిగానే నటించాన్నేను. ఎన్టీఆర్‌ కథానాయకుడు, ఎన్టీఆర్‌ మహానాయకుడు అద్భుతమైన విజయాలు సాధించి బాలకృష్ణగారికి గొప్ప పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’’ అన్నారు.
దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ‘‘బాలకృష్ణకి ఆశీస్సులు. చిట్టడవిలో పరిమళాలు అందించే ఒక్క పూల చెట్టున్నా ఆ వనం అంతా సుగంధభరితం అవుతుంది. నందమూరి తారక రామారావు జీవితం అటువంటిది. తెలుగు ప్రజలకి, జాతికి గుర్తింపును, గౌరవాన్ని తీసుకొచ్చిన మనిషి ఆయన. ఆజానుబాహు సుందరరూపం, ఖంగున మోగే కంచు కంఠం, స్ఫూర్తిప్రదాయకం, స్వయంకృషికి సాక్షాత్కారం, రాజకీయ ప్రభంజనం, పేదలకి ఆపన్నహస్తం రామారావుగారు. వారి జీవితాన్ని సినిమాగా తీసుకురావడం సాహసోపేతం. తమ్ముడు చేసిన ఈ సాహసాన్ని అభినందిస్తున్నా. నాన్నగారిని గుర్తు చేసేలా బాలకృష్ణ ఆహార్యం కనిపిస్తోంది.  మా అమ్మగారి పాత్రలో విద్యాబాలన్‌ జీవించారు’’ అన్నారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘నేను లక్ష్మీప్రసన్న పిక్షర్స్‌ బ్యానర్‌ పెట్టినప్పుడు అన్నయ్య ‘బొబ్బిలిపులి’ గెటప్పులో తొలి కొబ్బరికాయ కొట్టారు. అదే సంస్థలో అన్నయ్య చివరి చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’ తీశాం. ఏకగర్భం నందు జన్మించకపోయినా మేమిద్దరం అన్నదమ్ములం. ఆయనతో ఉన్న అనుబంధం జన్మజన్మలకి మరిచిపోలేను. అటువంటి మహానటుడి కడుపున పుట్టిన బాలయ్యని అన్నయ్య రూపంలో చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. ఈ చిత్రం చరిత్ర సృష్టించాలని కోరుకొంటున్నా’’ అన్నారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌తో పనిచేయాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తితో 12 సినిమాలు చేశాను. ‘ఎన్టీఆర్‌’ సినిమాని నేను 12సార్లు చూస్తాను. ప్రతి నెలా చూస్తాను’’ అన్నారు.

విద్యాబాలన్‌ మాట్లాడుతూ ‘‘నా తొలి తెలుగు సినిమా ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’. ఇంతకంటే గొప్ప ఆరంభాన్ని ఆశించను. బాలకృష్ణని చూసి ఆశ్చర్యపోయాను. ఆయన ఉత్సాహం కట్టిపడేసింది. ఇది నాకు ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాతో బాలకృష్ణ కుటుంబం నా కుటుంబమైంది’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, జమున, టి.సుబ్బరామిరెడ్డి, జయసుధ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, వరప్రసాద్‌రెడ్డి, బ్రహ్మానందం, నారా బ్రాహ్మణి, శ్రీభరత్‌, ప్రణీత, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి వసుంధర, ఈనాడు ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌, జయకృష్ణ, జయశంకర్‌కృష్ణ, రానా, జయసుధ, కైకాల సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

devadasu movie 2018 review దేవదాస్ movie #nagarjuna #nani #rashmika #aakankshasingh #devadasu #devdas #devadas2018 #dhevadhas #dhevadhasu #dewadas #dewadasu

Jr NTR and his wife lakshmi Pranathi are celebrating the seventh wedding anniversary and now are expecting their second child together.

petta full movie review | rajinikanth | simran | trisha